* ఏపీ మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు
హైదరాబాద్: సెప్టెంబరు 5న 10 వేల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సెప్టెంబరు 5న విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Daily Archives: August 25, 2014
సెప్టెంబరు 5న ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ –
జిల్లాకు 200 – 300 మంది విద్యా బోధకులు!
* హేతుబద్ధీకరణతో సంబంధం లేకుండానే నియామకాలు
* ఉర్దూ మీడియంకు 600 మంది తెలంగాణ విద్యాశాఖ కసరత్తు
* ఆదర్శ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు ఆదేశాలు జారీ
ఈనాడు – హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో సంబంధం లేకుండానే విద్యా బోధకులను నియమించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ఈ మేరకు కసరత్తు ఆరంభమైంది. బడ్జెట్ అవకాశాలను పరిశీలించి ఎంతమందిని నియమించాలనేది మూణ్ణాలుగు రోజుల్లో తేల్చబోతున్నారు. జిల్లాకు సుమారు 200 నుంచి 300 మంది దాకా బోధకుల అవసరం ఉంటుందన్నది ప్రాథమిక అంచనా! ఈ మేరకు డీఈవోల నుంచి కూడా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఉర్దూ మీడియం పాఠశాలల్లో 600 మంది విద్యా బోధకుల్ని నియమించటానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిసింది. ఇదే సమయంలో… మిగిలిన అన్ని పాఠశాలల్లోనూ సబ్జెక్ట్ టీచర్ల కొరత ప్రస్తావనకు వచ్చింది. నిజానికి గతంలోనే విద్యా బోధకుల్ని నియమించాలని అనుకున్నారు. అయితే ఖాళీలపై కచ్చితమైన సమాచారాన్ని సేకరించటానికి గాను ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేపట్టి… ఆ తర్వాత బోధకులను నియమించాలని నిర్ణయించారు. హేతబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ రూపొందించి ప్రభుత్వానికి పంపించింది కూడా! అయితే… ఎంసెట్ వివాదాలు… వివిధ కారణాల వల్ల దీనిపై ఆదేశాలు ఇంకా జారీ కాలేదు. ఒకవేళ హేతుబద్ధీకరణ ప్రక్రియ మొదలై ముగియటానికి… సమయం పట్టేలా ఉంది. ఈలోపు సబ్జెక్ట్ ఉపాధ్యాయుల కొరత కారణంగా చాలా పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బంది ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో… హేతుబద్ధీకరణతో సంబంధం లేకుండానే బడ్జెట్ వీలును పరిగణనలోకి తీసుకొని… జిల్లాలకు కొంతమంది చొప్పున విద్యా బోధకుల్ని నియమించాలని నిర్ణయానికి వచ్చారు. అంతా సవ్యంగా సాగితే…మళ్ళీ నిర్ణయాలేమీ మారకుంటే వచ్చే వారాంతానికల్లా దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ కావొచ్చని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా… హేతుబద్ధీకరణ ప్రక్రియను ఆపేది లేదని కూడా వర్గాలు స్పష్టంచేస్తున్నాయి.
15 రోజుల్లో ఆదర్శ పాఠశాలల్లో నియామకాలు
ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉద్యోగాల కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న ఆదర్శ పాఠశాలల (మోడల్ స్కూల్స్) ఉపాధ్యాయ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుమారు 1700 పీజీటీ, టీజీటీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పచ్చజెండా వూపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జగదీశ్వర్ ఆగస్టు 22న ఆదేశాలిచ్చారు. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్ తేదీలను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించబోతున్నారు. పదిహేను రోజుల్లో ఈ నియామకాల ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు పొంది పరీక్ష రాసి, ఎంపికైన తెలుగు మీడియం విద్యార్థులను కూడా నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. వరంగల్, హైదరాబాద్ ఆర్జేడీ కార్యాలయాల్లో పత్రాల పరిశీలన, రిపోర్ట్ చేయటం ఉంటుంది. ఈ నియామకాలు జరగ్గానే రాష్ట్రంలో ఒకట్రెండు కొత్త ఆదర్శ పాఠశాలలను కూడా ఆరంభించే అవకాశాలున్నాయని అంటున్నారు.