it looks like Vani mohan came back from her vacation.please try to send the pay bills as soon as possible to get the salary soon
Daily Archives: December 3, 2013
హెచ్సీయూ దూరవిద్య నోటిఫికేషన్ విడుదల
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం నిర్వహించే ఏడాది కాలపరిమితి గల పీజీ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ డిసెంబరు 3న విడుదలైంది. మొత్తం 14 కోర్సులను అందిస్తున్నామని, దరఖాస్తుల సమర్పణకు జనవరి 31 తుది గడువని సంచాలకుడు ఆచార్య షేక్ జిలానీ తెలిపారు. మరిన్ని వివరాలకు హెచ్సీయూ వెబ్సైట్ www.uohyd.ac.in ద్వారా లేదా 040-24600264కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.
భారత సంతతి యువకుడికి ప్రతిష్ఠాత్మక ప్రజ్ఞా పురస్కారం
వాషింగ్టన్: అమెరికాలోని భారత సంతతి కుర్రాడొకరు ప్రతిష్ఠాత్మక ప్రజ్ఞా పురస్కారం అందుకున్నాడు. మసాచ్యుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో చదువుతున్న సౌమిల్ బందోపాధ్యాయ (18) అతిసూక్ష్మ సాంకేతికతను ఉపయోగించి సూక్ష్మగ్రాహక పరారుణ శోధనిని కనుగొని ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. గత నవంబరులో ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ పరికరాన్ని శాస్త్ర, పౌర అవసరాలు, రక్షణ రంగ పరికరాల తయారీలో ఉపయోగించుకోవచ్చు. దీంతో అమెరికా సైనికవర్గాలు దీన్ని సైనిక అవసరాలకు ఉపయోగించే దిశగా ఇప్పటికే దృష్టి సారించాయి.
కాన్పూర్ ఐఐటీ విద్యార్థులకు కోట్ల కొలువు
కాన్పూర్: ఇద్దరు ఐఐటీ విద్యార్థులు భారీ వేతనంతో ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. కాన్పూర్ ఐఐటీలో డిసెంబరు 1 నుంచి 22 వరకు నిర్వహిస్తున్న ప్రాంగణ నియామకాల్లో అదే సంస్థకు చెందిన ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1.20 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం లభించింది. ఐటీ దిగ్గజం ఒరాకిల్ సంస్థలో వారు కొలువు సాధించినట్లు అక్కడి ఉద్యోగ కల్పన విభాగ అధ్యక్షుడు విమల్కుమార్ డిసెంబరు 3న తెలిపారు
13,388 కొత్త ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 13 శాఖల్లో 13,388 కొత్త ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వీటి భర్తీతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 2,400 కోట్ల అదనపు భారం పడనుంది. ఐసీడీఎస్, అటవీశాఖ…తదితర శాఖల్లోనూ ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు.
హైదరాబాద్కు హెచ్సీయూ బహుమతి
* ఏటా అంతర్జాతీయ నిపుణులకు ఆహ్వానం
* నగరంలో పలు వేదికల నుంచి ప్రసంగాలు
ఈనాడు, హైదరాబాద్: నగరాభివృద్ధిలో భాగంగా తమ వంతుగా హైదరాబాద్ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయస్థాయి నిష్ణాతులు, ప్రముఖులను ఆహ్వానించి ప్రసంగాలు ఏర్పాటు చేయాలని హెచ్సీయూ నిర్ణయించింది. జన్యువుల పనితీరుపై నాలుగు రోజులపాటు జరగనున్న అంతర్జాతీయ సదస్సు డిసెంబరు 2న విశ్వవిద్యాలయం లైఫ్ సైన్సెస్ స్కూల్లో ప్రారంభమైంది. దానితోపాటు సొసైటీ ఆఫ్ బయలాజికల్ కెమిస్ట్స్(ఇండియా) 82వ వార్షిక సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి రామకృష్ణ రామస్వామి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాదికి ఒక వారం పాటు అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించి సమకాలీన సమస్యలపై మాట్లాడిస్తామని చెప్పారు. బిల్గేట్స్, హిల్లరీ క్లింటన్ లాంటి వారిని నగరానికి ఆహ్వానిస్తామన్నారు. హైదరాబాద్ లెక్చరర్స్ పేరిట ప్రసంగాలను ఏర్పాటు చేస్తామన్నారు. డిసెంబరు 19న ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్, 20 లేదా 21న నోబెల్ బహుమతి గ్రహీత వెంకీ రామకృష్ణన్ విశ్వవిద్యాలయానికి వస్తున్నారని చెప్పారు. జనవరి 9 లేదా 10న అరుణారాయ్ రానున్నారని, ఆ సందర్భంగా ఆమెకు గతంలో ప్రకటించిన గౌరవ డాక్టరేట్ అందజేస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయంలో 67 ఆచార్యుల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశామని, దరఖాస్తుల గడువు డిసెంబరు 16 వరకు ఉందన్నారు.
తెవివిలో 9 నుంచి సామాజిక శాస్త్రాలపై జాతీయ కార్యశాల
తెవివి క్యాంపస్ (డిచ్పల్లి), న్యూస్టుడే: తెలంగాణ విశ్వవిద్యాలయంలో డిసెంబరు 9 నుంచి ఆరు రోజుల పాటు ‘రీసెర్చ్ మెథడాలజీ కోర్సు ఇన్ సోషల్ సైన్సెస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ పీహెచ్డీ స్కాలర్స్’ అనే అంశంపై జాతీయ కార్యశాల (వర్క్షాపు) నిర్వహించనున్నట్లు వర్క్షాపు డైరెక్టర్, మాస్ కమ్యూనికేషన్ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ చంద్రశేఖర్ డిసెంబరు 2న తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (ఐసీఎస్ఎస్ఆర్) దక్షిణ ప్రాంతీయ కేంద్రం సమన్వయ సహకారంతో నిర్వహించనున్న ఈ కార్యశాల ప్రారంభోత్సవానికి కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెంకట రత్నం, రిజిస్ట్రార్ ఆచార్య సాయిలు, ఐసీఎస్ఎస్ఆర్ ప్రాంతీయ సంచాలకులు ఆచార్య ఫిసర్ బీన్తో పాటు దక్షిణాఫ్రికాలోని వేల్స్ యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగం ఆచార్య రవీందర్ హాజరవుతారన్నారు. సామాజిక శాస్త్రాల పరిశోధనల్లో ఎదురయ్యే పలు సమస్యలతో పాటు శాస్త్రీయ పరిశోధనలు, సమాచార సేకరణ, విశ్లేషణ, పరిశోధన ప్రతిపాదనలు, పరిశోధన గ్రంధం రూపకల్పనలో మెలకువలను ఈ వర్క్షాప్ ద్వారా సమగ్రంగా వివరించనున్నట్లు పేర్కొన్నారు. పాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఐపీఈ లాంటి ప్రముఖ సంస్థల్లో పనిచేస్తున్న ఆచార్యులు, రిసోర్స్ పర్సన్లు హాజరై స్కాలర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని చంద్రశేఖర్ వివరించారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుంచి పీహెచ్డీ స్కాలర్లు దరఖాస్తు చేసుకుంటారని, ఐసీఎస్ఎస్ఆర్ నియమ నిబంధనలకు లోబడి తుది జాబితా రూపొందుతుందని ఆయన పేర్కొన్నారు.
మరో 234 ఆదర్శ పాఠశాలలు
* ఉత్తర్వులుజారీచేసినప్రభుత్వం
ఈనాడు-హైదరాబాద్: రాష్ట్రంలో మరో 234 ఆదర్శ పాఠశాలల ప్రారంభానికి ప్రభుత్వం డిసెంబరు 3న అనుమతినిచ్చింది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో రూ.904.23 కోట్లు వ్యయం చేయనున్నాయి. ఈ పాఠశాలల ఏర్పాటు సందర్భంగా 4,680 మంది బోధకుల నియామకాలను చేపట్టనున్నారు. 3,236 మంది బోధనేతర సిబ్బందిని పొరుగుసేవల కింద నియమించాలని మాధ్యమిక విద్యా శాఖ మంగళవారం నాటి ఉత్తర్వుల్లో పేర్కొంది. తొలివిడత కింద ఈ విద్యా సంవత్సరం నుంచి 355 ఆదర్శ పాఠశాలలను ప్రారంభించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేయగా.. కొన్ని మినహా మిగిలివన్నీ అరకొర సౌకర్యాల మధ్య నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మలివిడత కింద 234 ఆదర్శ పాఠశాలలను ప్రారంభించేందుకు మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
కళాశాలలకు ఎక్కని ఆన్లైన్ పాఠాలు
* వర్సిటీలతో అనుసంధానంపై అనాసక్తి
ఈనాడు, హైదరాబాద్: ఎ-వ్యూ సాఫ్ట్వేర్ ద్వారా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే విషయంలో చాలామటుకు వృత్తివిద్యా కళాశాలలు అనాసక్తిని ప్రదర్శిస్తున్నాయి. |
దీంతో, ఎ-వ్యూ ద్వారా ఆన్లైన్ పాఠాల అంశం అంత ప్రోత్సాహకరంగా ముందుకు సాగడం లేదు. అసలీ సాఫ్ట్వేర్ సమకూర్చుకోవడానికి సైతం కొన్ని కళాశాలలు ఆసక్తి చూపటం లేదు. ఏ-వ్యూ (అమృత వర్చువల్ ఇంటరాక్టివ్ ఈ లెర్నింగ్ వరల్డ్) అనే సాఫ్ట్వేర్ ద్వారా విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో నిపుణులు పాఠాలు చెబుతుంటే…అనుబంధ కళాశాలల్లోని అధ్యాపకులు, విద్యార్థులు వినవచ్చు. సందేహాలుంటే నివృత్తి చేసుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారా ముఖ్యంగా ఇంజినీరింగ్లో నాణ్యత పెంచాలన్నది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ లక్ష్యం. అందుకే, ఈ సాఫ్ట్వేర్ను అన్ని విశ్వవిద్యాలయాలకు ఉచితంగా అందిస్తోంది. ఇంటర్నెట్ వసతికోసం…10 ఎంబీపీఎస్ సామర్ధ్యం బ్యాండ్విడ్త్ వరకూ అందించేందుకు బీఎస్ఎన్ఎల్తో ఒప్పందం సైతం కుదుర్చుకుంది. ఇంతచేసినా కళాశాలలు ఆసక్తి చూపకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. రాష్ట్రంలో ఒక్క జేఎన్టీయూ-హెచ్, ట్రిపుల్ ఐటీ మాత్రమే ఏ-వ్యూ సాఫ్ట్వేర్ను సమకూర్చుకున్నాయి. ఇందులో జేఎన్టీయూహెచ్కి అనుబంధంగా 454 కళాశాలలుంటే 111 మాత్రమే దీనిని వినియోగించుకోవడానికి ఆసక్తి చూపాయి. పాఠాలను సద్వినియోగానికి 20-30 కళాశాలలే ముందుకొస్తున్నాయి.
సిలబస్ ప్రకారం ఉండవు: కళాశాలల యాజమాన్యాల వాదన మరోరకంగా ఉంది. అసలీ ఆన్లైన్ పాఠాలు సిలబస్ ప్రకారం ఉండవు. అందువల్ల విద్యార్థులు సమయం వృథా అనే భావనతో ముందుకురారు. పాఠాలను వెబ్సైట్లో పెడితే…ఆసక్తి ఉన్నవారు అవకాశం ఉన్నప్పుడు చూస్తారని యాజమాన్యాలు అంటున్నాయి. విశ్వవిద్యాలయంతో అనుసంధానం తప్పనిసరన్న నిబంధనేమీ లేదు. అందువల్ల వర్సిటీ నుంచి కళాశాలలపై ఒత్తిడి తేలేకపోతున్నాం. అయితే, ఈ కార్యక్రమం ప్రయోజనాలను వివరిస్తూ పలుమార్లు కళాశాలలకు సమాచారాన్నిస్తున్నాం. సిలబస్ ప్రకారం అన్ని పాఠాలు చెప్పడం కష్టం. అయినప్పటికీ… కొన్ని ముఖ్యమైన పాఠాలను చెప్పిస్తున్నాం అని స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(జేఎన్టీయూ-హెచ్) సంచాలకులు ఆచార్య శ్రీనివాసరావు తెలిపారు.