* ప్రముఖ ఆర్థికవేత్త మహేంద్రదేవ్
ఏఎన్యూ (గ్రామీణమంగళగిరి), న్యూస్టుడే: సమాజాభివృద్ధికి పరిశోధనాత్మక ఆవిష్కరణలు ఎంతో అవసరమని, ఈ దిశగా విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు తమ మేథకు పదునుపెట్టి ముందడుగు వేయాలని ప్రముఖ ఆర్థికవేత్త, ఇందిరాగాంధీ అభివృద్ధి విషయాల పరిశోధనాత్మక సంస్థ సంచాలకులు ఆచార్య సూర్యదేవర మహేంద్రదేవ్ ఆకాంక్షించారు. డిసెంబరు 28న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన 33, 34 స్నాతకోత్సవాల్లో గౌరవ డాక్టరేట్ను మహేంద్రదేవ్కు ఉపకులపతి కోదాటి వియన్నారావు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవ్ స్నాతకోత్సవ సందేశమిచ్చారు. పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా విద్యార్థులు పరిశోధనలు, ఆవిష్కరణలవైపు దృష్టి సారించాలని ఆయన సూచించారు. వీసీ వియన్నారావు మాట్లాడుతూ వర్సిటీలోని పీజీ కోర్సులు అన్నిటికీ అమలయ్యే విధంగా ఛాయిస్ క్రెడిట్ విధానాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేశామని చెప్పారు. బోధన పరిశోధన అభివృద్ధిలో భాగంగా వర్సిటీలో వివిధ విభాగాలు కేంద్రాలు అనేక సదస్సులను నిర్వహించాయన్నారు. వర్సిటీలో వివిధ విభాగాల్లో మొత్తం 241 మంది ఎంఫిల్, 115 మంది పీహెచ్డీ డిగ్రీల కోసం పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 232 మందికి బంగారు పతకాలు, 165 మందికి పీహెచ్డీ డిగ్రీలు, 40 మందికి ఎంఫిల్ డిగ్రీలను వీసీ కె.వియన్నారావు ప్రదానం చేశారు.