హైదరాబాద్: చిత్తూరు జిల్లా పీలేరులో బీసీ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం డిసెంబరు 5న ఉత్తర్వులు జారీ చేసింది. దీని కోసం రూ. 45.68 లక్షలను మంజూరు చేసింది.
Daily Archives: December 6, 2013
అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నోబెల్ శాస్త్రవేత్తల ప్రసంగం
* 8 నుంచిసైన్సుసదస్సు
అలహాబాద్: అలహాబాద్లోని ట్రిపుల్ ఐటీలో డిసెంబరు 8 నుంచి జరిగే ‘సైన్సు సదస్సు’లో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, నోబెల్ గ్రహీత సెర్జ్ హరోచ్, జోసెఫ్ సిఫకస్లు ప్రసంగించనున్నట్లు ట్రిపుల్ ఐటీ సంచాలకులు ఎండీ తివారీ తెలిపారు. డిసెంబరు 8 నుంచి 14 వరకు జరిగే ఈ సదస్సులో దాదాపు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొననున్నట్లు చెప్పారు. ఈ సదస్సులో భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం (2012) పొందిన సెర్జ్ హరోచ్, కంప్యూటింగ్ రంగంలో నోబెల్గా పరిగణించే ట్యూరింగ్ పురస్కారం (2007) అందుకున్న జోసెఫ్ సిఫకస్లు ప్రసంగించనున్నారు.
అరచేతిలో ఆంగ్లబోధన మెలకువలు
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఇక నుంచి ఆంగ్ల బోధనలో మెలకువలు ఎప్పటికప్పుడు అందనున్నాయి. నేరుగా ఉపాధ్యాయుల చరవాణి (మొబైల్ ఫోన్)కే ఆంగ్ల బోధనలో మెలకువలకు సంబంధించిన శబ్ద, దృశ్య రూపాలు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధ్యాయ విద్యాసామగ్రిని అందుబాటులోకి తెచ్చేందుకు బ్రిటిష్ కౌన్సిల్, పశ్చిమబెంగాల్ విద్యాశాఖ ఉమ్మడిగా చేపట్టిన ఓ ప్రాజెక్టులో భాగంగా ఈ సౌకర్యాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నారు.
విద్యకు ఐదేళ్ల వరకు ప్రస్తుత విధానాలే
ఈనాడు – హైదరాబాద్: విభజన అనంతరం రెండు రాష్ట్రాల విద్యా సంస్థల్లో ప్రవేశాలను ఐదేళ్ల వరకు ప్రస్తుతం ఉన్నట్టే కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇంజినీరింగ్, ఇతర కళాశాలల్లో కన్వీనర్, యాజమాన్య కోటా సీట్ల భర్తీలో ఐదేళ్ల వరకు ఎలాంటి తేడా ఉండదు. పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలు ఐదేళ్ల వరకు యథాతథంగానే పనిచేస్తాయి. అలాగే ఉన్నత విద్యామండలి, ఇంటర్ బోర్డు, ఇంటర్ విద్యాశాఖ, ఎస్సెస్సీ బోర్డు, ఇతర శాఖలూ ప్రస్తుతం మాదిరిగానే సేవలు అందించనున్నాయి.
కొత్త పీఎస్సీ ఏర్పడే దాకా తెలంగాణకు యూపీఎస్సీయే….
ఈనాడు – హైదరాబాద్: ప్రస్తుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా వ్యవహరిస్తుంది. రాజ్యాంగంలోని 315 ఆర్టికల్ కింద కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడే దాకా రాష్ట్రపతి ఆమోదంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనే (315(4) ఆర్టికల్ ప్రకారం) తెలంగాణ అవసరాలను తీరుస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏడు ఉన్నత విద్యాసంస్థలు
* తెలంగాణలో ఒక గిరిజన వర్సిటీ
* ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం
ఈనాడు – హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏడు జాతీయస్థాయి విద్యాసంస్థలను ఏర్పాటుచేసేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్లో జాతీయ స్థాయి సెంట్రల్ విశ్వవిద్యాలయం, మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం, ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ విశ్వవిద్యాలయం(ఇఫ్లూ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిఫుల్ఐటీ) ఉన్నాయి. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లోనూ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ వర్శిటీ, అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం, ట్రిఫుల్ ఐటీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఎన్ఐటీలో మాత్రమే సంబంధిత రాష్ట్రానికి చెందిన వారితో 50% సీట్లను భర్తీచేస్తారు. అందువల్ల ఇది సీమాంధ్ర ప్రాంతం వారికి బాగా ఉపయోగపడనుంది. మిగిలిన వాటిల్లో జాతీయ స్థాయిలో ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఈ సంస్థల రాకతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగు గుర్తింపు లభించనుందని భావిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే ఒక ట్రిఫుల్ ఐటీని చిత్తూరు జిల్లా సత్యవేడులో ఆరంభించారు. మరొక దాన్ని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ట్రిఫుల్ ఐటీ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేసిందని చెబుతున్నారు. దక్షిణాదిన మూడు రాష్ట్రాల్లో ఐఐఎం సంస్థలున్నాయి. ఇది కొత్తగా ఆంధ్రప్రదేశ్లోనూ నెలకొననుంది. వైజాగ్లో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించినా.. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం పేర్కొన్న కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎక్కడ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయంగా గుర్తిస్తారని అక్కడి అధ్యాపకవర్గాలు ఆశిస్తున్నాయి. చాలాకాలంగా ప్రతిపాదనలో ఉన్న తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయటానికీ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సంస్థల ఏర్పాటుకు కనీసం రూ.10వేల కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా. 12వ, 13వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వీటిని ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ప్రకటించిన విధంగా ఈ సంస్థలను ఏర్పాటు చేయటానికి త్వరగా నిధులు విడుదల చేస్తారా? లేదా? అన్నదే సందేహాస్పదమని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
‘ఎయిడెడ్’లో సంస్కృత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు
‘ఎయిడెడ్’లో సంస్కృత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు
* హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ నివేదన
ఈనాడు, హైదరాబాద్: ఎయిడెడ్ పాఠశాలల్లో సంస్కృత బోధకుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం డిసెంబరు 6న హైకోర్టుకు విన్నవించింది. దీంతో పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వానికి తగిన వెసులుబాటు కల్పిస్తూ కోర్టు తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది.
రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో సంస్కృత ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేయడానికి అనుమతిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రకాశం జిల్లాకు చెందిన ‘ఎయిడెడ్ సంస్కృత స్కూల్స్ మేనేజ్మెంట్ ఆసోసియేషన్’ ముఖ్య కార్యనిర్వాహక సమన్వయకర్త జె.వెంకటేశ్వర్లు, మరొకరు 2012లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ఎయిడెడ్ సంస్థల్లో సగం వరకు సంస్కృత ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని.. లేదా ఆయా సంస్థలే ఖాళీలను భర్తీ చేసుకునేలా అనుమతివ్వాలని.. ఈ వ్యవహారం మొత్తం మూడు నెలల్లో పూర్తి చేయాలని పేర్కొంటూ గతేడాది డిసెంబర్ 4న మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు అమలుకాకపోవడంతో పిటిషనర్లు ఈ ఏడాది మార్చిలో కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గత వారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కోర్టు ఆదేశాల్ని అమలు చేయనందుకు మాధ్యమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి హాజరై.. పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, 45 రోజుల గడువివ్వాలని అభ్యర్థించగా న్యాయస్థానం అనుమతించింది. మరోవైపు ఎయిడెడ్ పాఠశాలల్లో 65 సంస్కృత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది.
* ‘టైమ్స్’ జాబితాలో తొలి 100 ర్యాంకుల్లో 10 వీటికే
* ‘టైమ్స్’ జాబితాలో తొలి 100 ర్యాంకుల్లో 10 వీటికే
లండన్: అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని అత్యున్నత విద్యాసంస్థలకు తొలిసారి రూపొందించిన ర్యాంకుల్లో భారత్కు మెరుగైన స్థానాలు దక్కాయి. తొలి 100 స్థానాల్లో భారత్లోని విశ్వవిద్యాలయాలు 10 ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ తొలిసారిగా బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌతాఫ్రికా (బ్రిక్స్) దేశాలతో పాటు మరో 17 దేశాల్లోని యూనివర్సిటీల ర్యాంకుల జాబితాను రూపొందించింది. వీటిల్లో చైనా విశ్వవిద్యాలయాలు 1, 2, ర్యాంకులతో పాటు అత్యధిక స్థానాలను దక్కించుకోగా.. పాకిస్థాన్ విద్యాసంస్థలు ఒక్క ర్యాంకు కూడా పొందలేకపోయాయి. భారత్కు సంబంధించి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ చదివిన పంజాబ్ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది. దీనికీ.. చైనాలోని రెన్మిన్ యూనివర్సిటీకీ సంయుక్తంగా 13వ ర్యాంకు లభించింది. పంజాబ్ యూనివర్సిటీ తర్వాతి స్థానాల్లో ఐఐటీలు నిలిచాయి. ఖరగ్పూర్ (30), కాన్పూర్ (34), ఢిల్లీ, రూర్కీ (సంయుక్తంగా 37), గౌహతి (46), మద్రాస్ (47) ఐఐటీలకు ర్యాంకులు దక్కాయి. జాదవ్పూర్ విశ్వవిద్యాలయం కూడా మద్రాస్ ఐఐటీతో సమాన ర్యాంకును కైవసం చేసుకుంది. అలాగే అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి 50వ, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి 57వ ర్యాకులు దక్కాయి. ”కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ రష్యా, బ్రెజిల్ వంటి దేశాల కన్నా భారత్ మెరుగైన స్థానంలో నిలబడింది. ఇది ఇతర దేశాలతో పోటీ పడటంలో భారత్ నిజమైన శక్తిని ఎత్తి చూపుతోంది” అని టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకిగ్స్ సంపాదకుడు ఫిల్ బాటీ తెలిపారు. భారత్లోని 20 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఈ ర్యాంకుల విశ్లేషణకు సమాచారాన్ని పంపించాయని, అందువల్లే ఐఐఎంలు ఈ జాబితాలో చోటు చేసుకోలేదని వివరించారు.